
ఇంటర్నెట్ డెస్క్: గత కొద్ది రోజులుగా సెంటర్ ఆఫ్ ఎక్స్లెన్స్ (CoE) పేరు మార్మోగుతోంది. ఆటగాళ్ల గాయాల విషయంలో సరైన చర్యలు తీసుకోవడం లేదనే విమర్శలు వస్తున్నాయి. తాజాగా ఈ సీవోఈను బీసీసీఐ అధ్యక్షుడు మిథున్ మన్హాస్, కార్యదర్శి దేవజిత్ సైకియా, బోర్డు అధికారులు సందర్శించారు. సీవోఈ హెడ్ వీవీఎస్ లక్ష్మణ్తో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. క్రీడాకారులకు అన్ని సదుపాయాలను కల్పించడంలో లక్ష్మణ్ కృషి అభినందనీయం. అయితే, దాదాపు 40 ఎకరాల బంజరు భూమిని సకల సదుపాయాలతో కూడిన ‘సెంటర్ ఆఫ్ ఎక్స్లెన్స్’గా తీర్చిదిద్దడంలో బీసీసీఐ మాజీ కార్యదర్శి.. ప్రస్తుత ఐసీసీ ఛైర్మన్ జై షా పాత్ర అత్యంత కీలకం. ఇదే విషయాన్ని తాజాగా బీసీసీఐ కార్యదర్శి సైకియా, సీవోఈ హెడ్ లక్ష్మణ్ గుర్తు చేసుకున్నారు.
‘‘సీవోఈ ఇంత స్థాయిలో అభివృద్ధి కావడానికి జై షా వేసిన అడుగులే కారణం. కార్యదర్శిగా ఉన్నప్పుడు.. బీసీసీఐ అపెక్స్ కౌన్సిల్లో అందరితో చర్చించి ఈ నిర్ణయం తీసుకోవడం వెనుక ఆయనదే కీలక పాత్ర. యుద్ధ ప్రాతిపదికన చేపట్టాలని పట్టుబట్టారు. పాత జాతీయ క్రికెట్ అకాడమీ స్థానంలో అద్భుతమైన సదుపాయాలు కలిగిన ఎక్స్లెన్స్ సెంటర్ను నిర్మించాం. ప్రాజెక్టును ప్రారంభించే క్రమంలో చాలా నిబంధనలను పాటించాల్సి వచ్చింది. ఈ క్రమంలో ఎదురైన చట్టపరమైన అడ్డంకులను తొలగించడానికి జై షా (Jay Shah) వ్యక్తిగతంగా చాలాసార్లు ఇక్కడికి వచ్చారు. దాదాపు 40 ఎకరాల బీడు భూమిని క్రమబద్ధీకరించుకొనే క్రమంలో సవాళ్లు ఎదురయ్యాయి. నిరుపయోగంగా ఉన్న ఈ భూమిని తిరిగి తీసుకోవాలని కొందరు స్థానికులు భావించారు. మేం అనుకొన్న సమయానికి పనిని ప్రారంభించడానికి ల్యాండ్ ప్రక్రియ అడ్డంకిగా మారింది. అప్పుడు జై షా కృషి మరువలేనిది. అందరినీ ఏకతాటిపైకి తీసుకొచ్చి ఇబ్బందులను తొలగించి మార్గం సుగమం చేశారు’’ అని దేవజిత్ (Davjit Saikia) గుర్తు చేసుకున్నారు.
‘‘కేవలం రెండేళ్లలోనే అత్యుత్తమ మౌలిక సదుపాయాలతో కూడిన సెంటర్ ఆఫ్ ఎక్స్లెన్స్ సెంటర్ సిద్ధం చేయగలిగాం. ఇందులో ఎక్కువ క్రెడిట్ జై షాదే. ఈ ప్రాజెక్టు పట్ల చాలా ఆసక్తి చూపించారు. ఆర్కిటెక్ట్స్, ఎల్ అండ్ టీ టీమ్తో నిరంతరం సంప్రదింపులు జరిపారు. ఇదంతా నేను దగ్గర నుంచి చూశా’’ అని వీవీఎస్ లక్ష్మణ్ (VVS Lakhman) తెలిపాడు. 2022 ఫిబ్రవరి 14న ఈ నిర్మాణ పనులు ప్రారంభించగా.. 2024 నవంబర్లో సీవోఈ కార్యకలాపాలు మొదలైన సంగతి తెలిసిందే.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.





