
దాదాపు పది రోజుల సుదీర్ఘ అజ్ఞాతం తర్వాత కొండా దంపతులు బయటకు వచ్చారు. నిన్న కొండా సురేఖకు మీనాక్షి నటరాజన్ నుండి పిలుపు రావటంతో మళ్ళీ వీరి రాజకీయంపై జిల్లాలో ఆసక్తి కనిపిస్తోంది. పదిరోజుల తర్వాత బయటకు వచ్చిన కొండా దంపతులు.నేడు ముఖ్య కార్యకర్తలు, అభిమానులతో భేటీ అయ్యారు.
మాజీ మంత్రి కొండా సురేఖ, మాజీ ఎమ్మెల్సీ కొండా మురళి దాదాపు పది రోజుల తర్వాత బహిరంగంగా కనిపించడంతో హనుమకొండ రామ్‌నగర్‌లోని వారి నివాసం వద్ద కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో చేరుకున్నారు. మొదట నివాసం వద్దే ముఖ్య నేతల, కార్యకర్తల సమావేశం నిర్వహించాలని భావించినా వర్షం కారణంగా సమావేశం వరంగల్ కు మారింది.
వరంగల్‌లోని ఎంకే నాయుడు కన్వెన్షన్ హాల్‌లో కొండా దంపతులు ముఖ్య కార్యకర్తలు, అభిమానులతో సమావేశం కానున్న నేపథ్యంలో ఈ భేటీకి రాజకీయ ప్రాధాన్యత సంతరించుకుంది. ఇటీవల చోటుచేసుకున్న పరిణామాల నేపథ్యంలో కొండా దంపతుల తదుపరి అడుగుపై రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది. ముఖ్యంగా నిన్న ఢిల్లీ నుంచి మాజీ మంత్రి కొండా సురేఖకు ఫోన్ రావడం కూడా ప్రాధాన్యత సంతరించుకుంది.
ఈ పరిణామాల నేపథ్యంలోనే కొండా దంపతులు కార్యకర్తలతో సమావేశమై భవిష్యత్ కార్యాచరణపై చర్చించనున్నారు. అయితే కొండా మురళి రాజకీయ వ్యూహంపై ఆసక్తి ప్రజలలో కొనసాగుతుండగా ఆయన తన వ్యూహం తన తండ్రికే చెప్పలేదని, మీడియాకు ఎలా చెప్తానని వ్యాఖ్యలు చేశారు. ముఖ్య కార్యకర్తల సమావేశంలో కీలక ప్రకటన చేస్తానని తెలిపారు.
అయితే మీడియా ప్రతినిధులతో మాట్లాడిన కొండా మురళి.. కార్యకర్తలతో సమావేశమై చర్చించిన తర్వాత తాము ఏం చేయబోతున్నామో, తమ తదుపరి కార్యాచరణ ఏమిటో వెల్లడిస్తామని తెలిపారు.దీంతో నేడు కార్యకర్తల సమావేశంలో కొండా దంపతులు ఎలాంటి నిర్ణయం ప్రకటిస్తారనే దానిపై ఉత్కంఠ నెలకొంది.
అటు కొండా వర్గంలోనే కాదు, కొండా దంపతుల రాజకీయాలను వ్యతిరేకిస్తున్న వర్గంలో కూడా వారి ప్రకటన పైన ఆసక్తి కనిపిస్తోంది. మళ్ళీ ఢిల్లీ నుండి కొండా సురేఖకు పిలుపు రావటం కూడా వారిలో ఆందోళన కలిగిస్తుంది. ఏది ఏమైనా ఈరోజు కొండా దంపతులు తమ రాజకీయ భవితవ్యానికి సంబంధించి కీలక ప్రకటన చేస్తారని అందరూ భావిస్తున్నారు.






