

- ‘ఢీ’ విన్నర్ రాజుపై కేసు
- పెళ్లి పేరుతో రూ.12 లక్షల మోసం
- న్యాయం చేయాలంటూ బాధితురాలి విజ్ఞప్తి
Dancer Raju: ప్రముఖ బుల్లితెర డ్యాన్స్ రియాలిటీ షో ‘ఢీ’ సీజన్ 10, 20 విజేత డ్యాన్సర్ రాజుపై నమోదైన మోసం కేసు తెలుగు బుల్లితెర వర్గాల్లో తీవ్ర కలకలం రేపుతోంది. పెళ్లి చేసుకుంటానని నమ్మించి ఒక యువతిని ఆర్థికంగా, మానసికంగా మోసం చేశాడనే ఆరోపణలపై హైదరాబాద్ పోలీసులు కేసు నమోదు చేసి విచారణను వేగవంతం చేశారు. ఈ కేసులో బాధితురాలి స్టేట్మెంట్ను పోలీసులు అధికారికంగా రికార్డ్ చేయడంతో వ్యవహారం మరింత సంచలనంగా మారింది.
రూ.12 లక్షల మోసం.. నటి బెదిరింపులు:
బాధితురాలు వెల్లడించిన వివరాల ప్రకారం.. డ్యాన్సర్ రాజు తనను పెళ్లి చేసుకుంటానని నమ్మించి దగ్గరయ్యాడని, పలు విడతలుగా దాదాపు 12 లక్షల రూపాయలు తీసుకుని మోసం చేశాడని ఆరోపించింది. తనను పక్కన పెట్టి ఓ ప్రముఖ సీరియల్ నటితో తిరుగుతున్నట్లు గుర్తించానని తెలిపింది. ఈ విషయమై పోలీసులకు ఫిర్యాదు చేయగా, రాజుతో పాటు ఆ సీరియల్ నటి కూడా తనను తీవ్రంగా బెదిరిస్తోందని బాధితురాలు ఆవేదన వ్యక్తం చేసింది.
న్యాయం చేయాలంటూ డిమాండ్:
నమ్మించి దగా చేసిన డ్యాన్సర్ రాజు(Dancer Raju)పై తెలుగు ఫిల్మ్ డ్యాన్సర్స్ అసోసియేషన్ కఠిన చర్యలు తీసుకోవాలని బాధితురాలు డిమాండ్ చేస్తోంది. తనకు న్యాయం జరిగేలా చూడాలని ఇండస్ట్రీ పెద్దలైన సుమలత, శేఖర్ మాస్టర్, జానీ మాస్టర్లకు విజ్ఞప్తి చేసింది. కాగా, ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని తదుపరి విచారణ కొనసాగిస్తున్నారు.






