హైదరాబాద్ రియల్ ఎస్టేట్లో ఊహించని గ్రోత్ కనిపిస్తోంది. ముఖ్యంగా దక్షిణ హైదరాబాద్లో భూముల ధరలు ఆకాశాన్నంటున్నాయి. కోకాపేట, రాయదుర్గం, నియోపోలిస్ లాంటి ఏరియాల్లో ఎకరం ధర రూ.250 కోట్లు దాటేసింది. రాయదుర్గంలో టీజీఐఐసీ శుక్రవారం నిర్వహించిన ఈ-వేలంలో ఎకరం రూ.264 కోట్ల రికార్డు ధర పలికింది. ఇదే ప్రాంతంలో మేలో ఎకరం రూ.237 కోట్ల ధర నమోదైంది. కాగా, కోకాపేట, నియోపోలిస్, రాయదుర్గం లాంటి ప్రాంతాల్లో కళ్లు చెదిరే టవర్లు నిర్మిస్తున్నారు సరే. మరీ నీటి సంగతేంటి..? ఆయా ప్రాంతాలు ప్రస్తుతం బోర్ వెల్స్ పైనే ఆధారపడి ఉన్నాయి. మరి భవిష్యత్తులో నీటి కొరత ఉండదా..? ఆయా ప్రాంతాల్లో నివసించే వారి నీటి అవసరాలు ఎలా తీరుతాయి..? ఆలోచిస్తే ఔను కదా అనిపిస్తుంది. ఈ నేపథ్యంలో కోకాపేట నియోపోలిస్ ప్రాంతాల్లో నీటి లభ్యతపై ఓ నెటిజన్ ఇంట్రెస్టింగ్ విషయాలు వెల్లడించారు.'హైదరాబాద్లో వేగంగా అభివృద్ధి చెందుతున్న కొకాపేట్–నియోపోలిస్ ప్రాంతంలో భారీ సంఖ్యలో హై-రైజ్ భవనాలు, అపార్ట్మెంట్లు నిర్మాణంలో ఉన్నాయి. దీంతో ఈ ప్రాంతంలో భవిష్యత్ నీటి అవసరాలు ఎలా తీరుతాయన్న ప్రశ్న సహజంగానే తలెత్తుతోంది. ముఖ్యంగా నియోపోలిస్లో బోర్వెల్స్పై ఆధారపడే పరిస్థితి లేకపోవడంతో వేలాది కుటుంబాలకు నిరంతర తాగునీటి సరఫరా ఎలా సాధ్యమవుతుందన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. అయితే ఈ ప్రాంతానికి నీటి సరఫరా కోసం స్థానిక బోర్వెల్స్ కంటే పెద్దస్థాయి మున్సిపల్ బల్క్ వాటర్ మౌలిక సదుపాయాలపై దృష్టి సారిస్తున్నారు.నియోపోలిస్ ప్రాంతం సముద్రమట్టానికి సుమారు 588–592 మీటర్ల ఎత్తులో ఉంది. ఈ ఎత్తు నీటి వనరు కాకపోయినా.. నీటిని ఎత్తైన ప్రాంతాల్లోని రిజర్వాయర్లలో నిల్వ చేసి సాంకేతికంగా సాధ్యమైన చోట గ్రావిటీ ఆధారంగా పంపిణీ చేయడానికి మౌలిక సదుపాయాల పరంగా అనుకూలంగా ఉంటుంది. దీనివల్ల ప్రతి దశలో పంపింగ్పై ఆధారపడటాన్ని తగ్గించి విద్యుత్ వినియోగాన్ని కూడా నియంత్రించే అవకాశం ఉంటుంది. తాజా ప్రణాళికల ప్రకారం నియోపోలిస్–కొకాపేట్ ప్రాంతానికి భవిష్యత్ జనాభాను దృష్టిలో పెట్టుకుని సుమారు 226 మిలియన్ లీటర్ల రోజువారీ నీటి సరఫరా (MLD) సామర్థ్యంతో బల్క్ వాటర్ వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నారు.గోదావరి నీటి సరఫరా, శుద్ధి కేంద్రాలు, మాస్టర్ బ్యాలెన్సింగ్ రిజర్వాయర్లు, గ్రౌండ్ లెవల్, ఎలివేటెడ్ సర్వీస్ రిజర్వాయర్లు, భారీ పైప్లైన్లు, పంపింగ్ మౌలిక సదుపాయాలు కీలకంగా ఉండనున్నాయి. ఇప్పటికే నీటి సరఫరా, మురుగునీటి నిర్వహణకు సంబంధించి వందల కోట్లతో మౌలిక సదుపాయాల పనులు చేపడుతున్నారు. ఇందులో 1800 మిల్లీమీటర్ల గ్రావిటీ మెయిన్, 1,500 మిల్లీమీటర్ల పంపింగ్ మెయిన్, 9 మిలియన్ లీటర్ల సామర్థ్యంతో గ్రౌండ్ లెవల్ స్టోరేజ్ రిజర్వాయర్, రెండు 2.5 మిలియన్ లీటర్ల ఎలివేటెడ్ సర్వీస్ రిజర్వాయర్లు, పంప్హౌస్ వంటి నిర్మాణాలు ఉన్నాయి.నియోపోలిస్ ప్రాంతంలో భవిష్యత్లో సుమారు 10 లక్షల మంది జనాభాకు చేరుకోవచ్చని అంచనాలు ఉండగా.. నీటి మౌలిక సదుపాయాలను గరిష్ఠంగా 12.8 లక్షల జనాభా అవసరాలకు అనుగుణంగా ప్రణాళిక చేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. ఈ నేపథ్యంలో 226 MLD సామర్థ్యం చిన్నస్థాయి పరిష్కారం కాదని స్పష్టమవుతోంది. అయితే ఈ మొత్తం నీరు కేవలం అపార్ట్మెంట్లలోని కుటుంబాలకే కేటాయించబడుతుందని భావించడం సరికాదు. ఇది మొత్తం నియోపోలిస్–కొకాపేట్ అభివృద్ధి కారిడార్కు ఉద్దేశించిన సమగ్ర బల్క్ వాటర్ మౌలిక వ్యవస్థలో భాగం.అంతేకాదు.. గోదావరి డ్రింకింగ్ వాటర్ సప్లై ప్రాజెక్ట్ రెండో, మూడో దశల ద్వారా అదనపు నీటిని నగర అవసరాలకు అందించే ప్రణాళికలు కూడా ఉన్నాయి. ఈ విస్తృత నెట్వర్క్తో వేగంగా పెరుగుతున్న ORR పరిధిలోని ప్రాంతాలకు భవిష్యత్ నీటి అవసరాలను తీర్చే లక్ష్యంతో ప్రభుత్వం మౌలిక సదుపాయాలను ముందుగానే విస్తరిస్తోంది. అందువల్ల నియోపోలిస్లో ఆస్తి కొనుగోలు చేసే వారు కేవలం ‘బోర్వెల్ ఉందా?’ అనే ప్రశ్నకే పరిమితం కాకుండా, ఆ ప్రాంతానికి దీర్ఘకాలికంగా మున్సిపల్ నీటి సరఫరా వ్యవస్థ ఎలా ఉంది, రిజర్వాయర్లు, పైప్లైన్ నెట్వర్క్ ఎంత సామర్థ్యంతో ఉన్నాయి, మురుగునీటి శుద్ధి వ్యవస్థ ఎలా ఉంది అనే అంశాలను కూడా పరిశీలించాలి. వేగంగా విస్తరిస్తున్న నగరాల్లో భవనాల నాణ్యతతో పాటు నీరు, డ్రైనేజీ, విద్యుత్, రవాణా వంటి మౌలిక వసతులే భవిష్యత్ నివాసయోగ్యతను నిర్ణయిస్తాయి.' అని సయ్యద్ నూర్ అనే నెటిజన్ వెల్లడించారు.





