Sergio Gor Ladakh Visit News : డోనాల్డ్ ట్రంప్ ముఖ్య ప్రతినిధులలో ఒకరైన సెర్గియో గోర్.. తొలిసారిగా భారతదేశంలోని లడఖ్ ప్రాంతంలో పర్యటించారు. పలువురు దౌత్యవేత్తలతో కలిసి వచ్చిన ఆయన.. లడఖ్లోని ప్రసిద్ధ థిక్సే ఆశ్రమాన్ని సందర్శించి బౌద్ధమత విశేషాలను తెలుసుకున్నారు. అయితే ఈ పర్యటనలో ఎంతో ప్రాధాన్యత సంతరించుకుంటుందని భావించిన ఆధ్యాత్మిక నాయకుడు దలైలామాతో ఆయన సమావేశం.. చివరి నిమిషంలో రద్దు కావడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. అసలు ఈ భేటీ ఎందుకు క్యాన్సిల్ అయిందో మనం ఇప్పుడు తెలుసుకుందాం పదండి.దలైలామా భేటీ రద్దు వెనుక కారణమిదే..!దలైలామాతో జరగాల్సిన సమావేశం రద్దు కావడానికి గోర్ ఇటీవల కశ్మీర్ పర్యటనలో చేసిన వ్యాఖ్యలే కారణమని ప్రచారం సాగుతోంది. ముఖ్యంగా ఇటీవలే జమ్మూ కశ్మీర్ పర్యటనకు వెళ్లిన సెర్గియో గోర్.. ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లాతో కలిసి విలేకరులతో మాట్లాడారు. ఈక్రమంలోనే కశ్మీర్ను "భారత్లో అత్యంత ముఖ్యమైన భాగం" అని అభివర్ణించారు. కశ్మీర్ను సందర్శించడం ఇదే తొలిసారని, అది ఎంతో అందమైన ప్రాంతమని కొనియాడారు. అయితే ఈ వ్యాఖ్యలపై పాకిస్థాన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇలా ఈ కామెంట్లు కాస్త అంతర్జాతీయంగా ప్రాధాన్యత సంతరించుకుని.. సెర్గియో గోర్ పేరు ప్రత్యేకంగా వినిపించింది. ఈ నేపథ్యంలోనే లడఖ్లో అమెరికా అధికారులు కాస్త వెనక్కి తగ్గి, ప్రాధాన్యత తగ్గించుకోవడానికి మొగ్గు చూపి ఉంటారని నివేదికలు పేర్కొంటున్నాయి.అరగంట పాటు థిక్సే ఆశ్రమంలోనే గోర్..!లడఖ్కు చేరుకున్న గోర్.. థిక్సే ఆశ్రమంలో దాదాపు 30 నిమిషాల పాటు గడిపారు. అక్కడి బౌద్ధ సన్యాసులను అడిగి బౌద్ధ ధర్మం గురించి వివరాలు తెలుసుకున్నారు. ఉత్తర భారత దేశంలోని లడఖ్ ప్రాంతంలో కొండపైన ఉన్న ఈ థిక్సే ఆశ్రమం.. సెంట్రల్ లడఖ్లోనే అతి పెద్దది. ఇది టిబెట్లోని ప్రసిద్ధ 'పొటాలా ప్యాలెస్'ను పోలి ఉంటుంది. లేహ్ నగరం నుంచి 19 కిలో మీటర్ల దూరంలో ఉన్న ఈ ఆశ్రమాన్ని 1433లో స్థాపించారు. ఇక్కడ పురాతన బౌద్ధ చిత్రాలు, స్థూపాలు, స్క్రోల్ పెయింటింగ్స్తో పాటు 1980లలో ఏర్పాటు చేసిన 15 మీటర్ల (48 అడుగులు) ఎత్తైన మైత్రేయ బుద్ధుని విగ్రహం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. ప్రతిరోజూ ఉదయం ఇక్కడ జరిగే ప్రార్థనలు, వెనుక ప్రవహించే సింధు నదీ తీర దృశ్యాలు పర్యాటకులను విశేషంగా ఆకట్టుకుంటాయి.దౌత్య ప్రాధాన్యత సంతరించుకున్న పర్యటన..2020లో చైనాతో జరిగిన గల్వాన్ లోయ ఘర్షణలు, తదనంతర సరిహద్దు ఉద్రిక్తతల తర్వాత ఒక అగ్రశ్రేణి అమెరికా దౌత్యవేత్త లడఖ్ సరిహద్దు ప్రాంతంలో పర్యటించడం ఇదే తొలిసారి. లడఖ్కు రాకముందు ఆయన కశ్మీర్ వ్యాలీలో విస్తృత స్థాయి సమావేశాలు నిర్వహించారు. జమ్మూ కశ్మీర్ ముఖ్యమంత్రి ఓమర్ అబ్దుల్లాతో జరిగిన భేటీపై ఆయన హర్షం వ్యక్తం చేస్తూ.. ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు మరింత బలోపేతం అవుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. గతంలో 2011లో నాటి అమెరికా రాయబారి తిమోతీ రోమర్ అప్పటి సీఎంను కలిసిన తర్వాత.. దాదాపు 15 ఏళ్ల వ్యవధిలో ఒక అమెరికా రాయబారి జమ్మూ కశ్మీర్ ముఖ్యమంత్రితో సమావేశం అవ్వడం ఇదే తొలిసారి కావడం విశేషం. హోంమంత్రి అమిత్ షాతో ఉగ్రవాద నిరోధక సహకారంపై గోర్ చర్చించిన నేపథ్యంలో ఈ పర్యటన మరింత ప్రాధాన్యత సంతరించుకుంది.





