దేశ రాజధాని ఢిల్లీలోని ప్రెస్ క్లబ్ ఆఫ్ ఇండియా (పీసీఐ)లో గురువారం జరిగిన ఓ కార్యక్రమం సోషల్ మీడియాలో తీవ్ర చర్చకు దారితీసింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీని శ్రీరాముడి రూపంలో చిత్రీకరించిన కటౌట్ ముందు కొందరు వ్యక్తులు హారతి ఇవ్వడం తీవ్ర దుమారం రేపుతోంది. ‘ మోదీ చాలీసా ’ పఠించడంతో ఈ వ్యవహారం వైరల్గా మారింది. “జై జై మోదీ.. హర హర మోదీ” అంటూ నినాదాలు చేస్తున్న వీడియోలు సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతున్నాయి. ప్రధాని మోదీ.. కిరీటం, ఆభరణాలు ధరించిన శ్రీరాముడి తరహా రూపంలో చూపించిన కటౌట్ వైరల్ అవుతోంది.ఆ మోదీ కటౌట్ చేతిలో విల్లు, బాణం ఉండగా.. చుట్టూ ఉన్న కొందరు వ్యక్తులు హారతి ఇస్తూ నినాదాలు చేశారు. ఆ వీడియోలో ఉన్న పోస్టర్పై “శ్రీ నరేంద్ర మోదీ చాలీసా” అని పేర్కొన్నట్లు వీడియోల్లో కనిపిస్తోంది. ఈ కార్యక్రమానికి సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నెటిజన్ల మధ్య భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.ఈ ఘటనపై ప్రెస్ క్లబ్ ఆఫ్ ఇండియా స్పందించింది. ఈ కార్యక్రమాన్ని తాము నిర్వహించలేదని స్పష్టం చేసింది. గురువారం ఉదయం తమ ప్రాంగణంలో జరిగిన కార్యక్రమానికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయని పేర్కొంటూ పీసీఐ వివరణ ఇచ్చింది. ఓ సంస్థ ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించేందుకు క్లబ్లోని హాల్ను అద్దెకు తీసుకుందని తెలిపింది. అయితే హాల్ను అద్దెకు తీసుకునే సమయంలో అంగీకరించిన నిబంధనలను సంబంధిత సంస్థ ఉల్లంఘించిందని పేర్కొంది. విషయం తమ దృష్టికి వచ్చిన వెంటనే క్లబ్ అధికారులు జోక్యం చేసుకుని కార్యక్రమాన్ని నిలిపివేసినట్లు వెల్లడించింది.‘మోదీ చాలీసా’ కార్యక్రమానికి సంబంధించిన వీడియోలు వైరల్ కావడంతో సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. కొందరు ఈ కార్యక్రమాన్ని విమర్శిస్తుండగా.. మరికొందరు మోదీ ఫ్యాన్స్ అభిమానాన్ని చూపించారని పేర్కొంటున్నారు. రాజకీయాల్లో వ్యక్తి ఆరాధన ఎంతవరకు సమంజసం అనే అంశంపై కూడా నెటిజన్లు విమర్శలు గుప్పిస్తున్నారు. అయితే ఆ మోదీ చాలీసా కార్యక్రమంలో కనిపించిన వారిలో బిహార్ స్టేట్ ట్రాన్స్జెండర్ వెల్ఫేర్ బోర్డు సభ్యుడు రంజన్ సింగ్ ఉన్నట్లు కొన్ని వార్తలు వెలువడుతున్నాయి.మరోవైపు.. ప్రధాని నరేంద్ర మోదీకి గుడి కట్టాలనే ప్రతిపాదనపై గతంలోనూ చర్చ జరిగింది. బిహార్లోని ట్రాన్స్జెండర్ వెల్ఫేర్ బోర్డుకు సంబంధించిన సమావేశంలో ప్రధాని మోదీకి ఆలయం నిర్మించాలనే ప్రతిపాదన వచ్చినట్లు వార్తలు వచ్చాయి. మోదీ ప్రభుత్వం తమ సమాజానికి చేసిన పనులను గుర్తిస్తూ ఈ ప్రతిపాదన చేసినట్లు అప్పట్లో సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి.




