
సర్గం రవి కుమార్. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్గా పని చేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి రాజకీయాలు, స్పోర్ట్స్, వినోదం, క్రైమ్, జాతీయ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.
AP JAC Amaravati Protest: తెలుగు రాష్ట్రాల్లో ప్రభుత్వ ఉద్యోగులు తమ డిమాండ్ల సాధన కోసం, తమ సమస్యల పరిష్కారం కోసం ఆందోళనలను తీవ్రం చేస్తున్నారు. ఇప్పటికే తెలంగాణలో రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి వ్యతిరేకంగా భారీ ఉద్యమం చేపట్టగా.. ఇటు ఆంధ్రప్రదేశ్లోనూ ప్రభుత్వ ఉద్యోగులు భారీ నిరసనలకు దిగారు. న్యాయమైన సమస్యలు, పెండింగ్ బకాయిల పరిష్కారం కోసం ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లు మొదటి దశ ఉద్యమ కార్యాచరణకు నేటి నుంచి శ్రీకారం చుట్టారు.
తమ నిరసనలో భాగంగా మంగళవారం నల్ల బ్యాడ్జీలతో ఉద్యోగుల ఉద్యమానికి శ్రీకారం చుట్టారు. చంద్రబాబు సార్... తమ డబ్బులు తమకు ఇవ్వండి అనే నినాదంతో ఉద్యమాన్ని ప్రారంభించారు. రాష్ట్రంలోని గ్రామ సచివాలయాలు దగ్గర నుంచి ప్రభుత్వ పాఠశాలల్లో, అన్ని తహసీల్దార్ కార్యాలయాలు, మున్సిపల్ కార్యాలయాలు, వెటర్నరీ డిపార్ట్మెంట్ ఉద్యోగులు, అన్ని ఆర్టీసీ డిపోల్లో, వివిధ కార్యాలయాల ఉద్యోగులు, డివిజన్ స్థాయిలో ఆర్డీఓ కార్యాలయాల ఉద్యోగులు, మున్సిపాలిటీ ఉద్యోగులు, కార్మిక శాఖ, పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ ఉద్యోగులు, జిల్లా స్థాయిలోని అన్ని జిల్లా కలెక్టర్ కార్యాలయాల ఉద్యోగులు, జిల్లా స్థాయి వివిధ శాఖల కార్యాలయాల ఉద్యోగులు అందరూ నల్ల బ్యాడ్జీలు ధరించి విధులకు హాజరయ్యారు. వేలాది మంది ఉద్యోగులు తమ సెల్ఫోన్లలో "సీఎం సార్ మా డబ్బులు మాకు ఇవ్వండి" అని కామన్ డీపీగా పెట్టుకుని నిరసన తెలిపారు.
ప్రభుత్వ ఉద్యోగులు తమ ఉద్యమంలో భాగంగా సెప్టెంబర్ 1 నుంచి 5వ తేదీ వరకు ఉద్యోగులు నల్ల బ్యాడ్జీలు ధరించి విధులకు హాజరవుతూ నిరసనలు చెబుతున్నారు. ఉద్యోగులందరూ తమ వాట్సాప్ డీపీగా ,స్టేటస్లుగా “సీఎం సార్... మా డబ్బులు మాకు ఇవ్వండి” అనే నినాదంతో కూటమి ప్రభుత్వానికి తమ డిమాండ్ను తెలియజేస్తున్నట్లు చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు, సెక్రటరీ జనరల్ పలిశెట్టి దామోదరరావు తెలిపారు.
సెప్టెంబర్ 2 నుంచి 8 వరకు రాష్ట్రంలోని అన్ని జిల్లా, డివిజన్ కార్యాలయాలను ఏపీ జేఏసీ నాయకులు సందర్శించి ప్రతి ఉద్యోగిని కలసి ఉద్యమానికి గల కారణాలను వివరించి విస్తృత ప్రచారం చేశారు. రేపు, ఎల్లుండి అన్ని జిల్లా, డివిజన్ కార్యాలయాల వద్ద భోజన విరామ సమయంలో నిరసనలు చేయనున్నట్లు వెల్లడించారు. మొదటి దశ ఉద్యమంలో భాగంగా సెప్టెంబర్ 11వ తేదీన విజయవాడతో పాటు అన్ని జిల్లాకేంద్రాల్లో రౌండ్ టేబుల్ సమావేశాలు నిర్వహించి, అన్ని ట్రేడ్ యూనియన్లు, ఉద్యోగ సంఘాలను ఆహ్వానించి ఉద్యోగుల సమస్యలపై చర్చించి వారి మద్దతు కూడగట్టనున్నట్లు ఏపీ జేఏసీ అమరావతి ప్రతినిధులు టీవీ ఫణిపేర్రాజు, తిమ్మసర్తి నాగేశ్వరరావు వెల్లడించారు.
వేతన సవరణ సంఘం (పీఆర్సీ), డీఏలు, మధ్యంతర భృతి (ఐఆర్), పెండింగ్ బిల్లులు చెల్లించకుండా కూటమి ప్రభుత్వం ఆలస్యం చేస్తోందని ప్రభుత్వ ఉద్యోగులు ఆరోపించారు. ప్రభుత్వ తమ సమస్యలపై చర్చలకు పిలవకపోతే ఉద్యమానికి తీవ్ర స్థాయికి తీసుకెళ్తామని ఏపీ జేఏసీ అమరావతి ప్రకటించింది. జూలై 22వ తేదీన చర్చలు చేసి నిర్ణయాలు ప్రకటించకుండా కూటమి ప్రభుత్వం 40 రోజులుగా కాలయాపన చేస్తోందని ఉద్యోగ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. తమకు రావాల్సిన న్యాయమైన బకాయిలు, హక్కుల సాధన కోసం చేపట్టిన ఈ ఉద్యమంలో ఉద్యోగులందరూ స్వచ్ఛందంగా భాగస్వాములు కావాలని ఏపీజేఏసీ అమరావతి పిలుపునిచ్చింది.
'ఈ ఉద్యమం ఎవరికీ వ్యతిరేకం కాదు. ఉద్యోగులకు రావాల్సిన న్యాయమైన బకాయిలు, హక్కులను సాధించుకోవడమే లక్ష్యం' అని ఏపీ జేఏసీ అమరావతి స్పష్టం చేసింది. కూటమి ప్రభుత్వం సానుకూలంగా స్పందించి ఉద్యోగుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని జేఏసీ నాయకులు డిమాండ్ చేశారు.




