
సర్గం రవి కుమార్. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్గా పని చేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి రాజకీయాలు, స్పోర్ట్స్, వినోదం, క్రైమ్, జాతీయ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.
India vs Pakistan Highlights: హాకీ ప్రపంచకప్లో భారత జట్టు అద్భుతం చేసింది. ప్రపంచ హాకీ టోర్నీలో భారత జట్టు చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్ను చిత్తు చేసి ముందడుగు వేసింది. భారీ తేడాతో విజయం సాధించిన భారత జట్టు గోల్స్తో అదరగొట్టింది. హర్మన్ప్రీత్ సింగ్, అభిషేక్ గోల్స్తో చెలరేగడంతో పాకిస్థాన్ ఆటగాళ్లు ఏమాత్రం పోరాడలేకపోయారు. చేసిన మూడు గోల్స్కు పరిమితమై ఓటమితో ప్రపంచకప్ను పాకిస్థాన జట్టు వీడింది. ఈ మ్యాచ్కు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
పురుషుల హాకీ ప్రపంచకప్ 2026లో ఓటమి నుంచి తేరుకున్న భారత జట్టు హోరాహోరీగా జరిగిన మ్యాచ్లో పాకిస్థాన్పై తీవ్రంగా శ్రమించి విజయం సాధించింది. ఆమ్స్టల్వీన్ వేదికగా బుధవారం జరిగిన పూల్-డి మ్యాచ్లో భారత్ 5-3 తేడాతో పాకిస్థాన్ను చిత్తుచేసింది. భారీ విజయాన్ని అందుకున్న భారత జట్టు రెండో రౌండ్కు అర్హత సాధించగా.. పాకిస్తాన్ జట్టు ప్రపంచకప్ టోర్నీ నుంచి నిష్క్రమించింది.
మ్యాచ్ ప్రారంభం నుంచే భారత జట్టు దూకుడుగా ప్రదర్శన చేసింది. కెప్టెన్ హర్మన్ప్రీత్ సింగ్, ఫార్వర్డ్ అభిషేక్ చెరో రెండు గోల్స్తో చేసి ప్రత్యర్థి జట్టును ఒత్తిడిలో పడేశారు. రెండో క్వార్టర్ పూర్తయ్యాక భారత్ 3-0తో పాకిస్థాన్పై ఆధిక్యం సాధించి మ్యాచ్పై పూర్తి పట్టు సాధించింది. మూడో క్వార్టర్లో పాకిస్థాన్ గొప్పగా పుంజుకుని రెండు గోల్స్ సాధించింది. అయితే అదే సమయంలో భారత జట్టు మరో గోల్ సాధించడంతో 4-2 భారత్ ఆధిక్యం కొనసాగింంది. ఆఖరి క్వార్టర్లో పాకిస్థాన్ తొలుత ఓ గోల్ కొట్టి భారత్కు ఝలక్ ఇచ్చింది. తర్వాత గోల్స్ కోసం పాకిస్థాన్ ఆటగాళ్లు శ్రమించినా భారత డిఫెండర్లు ఎదురు నిలబడి గట్టిగా సమాధానం ఇచ్చారు. ఆట పూర్తయ్యేసరికి ఆధిక్యం 5-3 ఉండడంతో పాకిస్థాన్కు ఓటమి తప్పలేదు.
భారత గోల్స్ ఇలా.. రెండో రౌండ్లోకి అడుగుపెట్టాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్లో భారత ఆటగాళ్లు విజృంభించారు. మ్యాచ్ ప్రారంభమైన ఐదో నిమిషంలోనే కెప్టెన్ హర్మన్ప్రీత్ గోల్ సాధించి శుభారంభం అందించాడు. తర్వాత 11వ నిమిషంలో అభిషేక్ గోల్ చేసి అభిమానుల్లో ఉత్సాహం నింపాడు. రెండో క్వార్టర్లో 21వ నిమిషానికి హర్మన్ప్రీత్ ఓ గోల్ చేయగా.. కొద్దిసేపటికే 24వ నిమిషానికి అభిషేక్ గోల్ చేయడంతో పాకిస్థాన్పై భారత జట్టు ఆధిక్యంలోకి వచ్చింది. మూడో క్వార్టర్లో హార్దిక్ సింగ్ 35వ నిమిషానికి ఒక గోల్ చేయడంతో ప్రత్యర్థిపై భారత ఆధిక్యం పెరిగింది.
పాకిస్తాన్ గోల్స్ పాక్ తరఫున హన్నన్ షాహిద్ రెండు గోల్స్ సాధించాడు. 22వ, 46వ నిమిషాల్లో షాహీద్ గోల్స్ కొట్టగా.. 24వ నిమిషంలో సుఫ్యాన్ ఖాన్ గోల్ కొట్టాడు. గోల్స్ కోసం పాకిస్థాన్ ఆటగాళ్లు పోరాడినా భారత డిఫెండర్లు పెట్టని కోటలా నిలబడి అడ్డుకోవడంతో వారి శ్రమ వృథాగా మారి మ్యాచ్ ఓడిపోవడమే కాకుండా టోర్నీ నుంచి నిష్క్రమించాల్సి వచ్చింది.





